27.7 C
Hyderabad
April 19, 2024 23: 47 PM
Slider ఆధ్యాత్మికం ఆంధ్రప్రదేశ్

హనుమంతునిపై వేంకటాద్రిరాముడు

Navaratri-Brahmotsavam-Hanumantha-Vahanam

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శ‌నివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు శేషాచలాధీశుడు శ్రీరాముని అవతారంలో ధ‌నుస్సు, బాణం ధ‌రించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చాడు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

హనుమంతుడు భగవత్‌ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, నవవ్యాకరణ పండితుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రివాసుని మూపున వహించి తిరువీధులలో దర్శనమివ్వడం భక్తులను ఆనందపరవశులను చేసింది. గురు శిష్యులై శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచనగావించిన మహనీయుడు కనుక వాహ్య వాహకరూపంలో ఈ ఇరువురినీ చూసిన వారికి వేదాలతత్త్వం ఒనగూరుతుంది.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శ‌నివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం కన్నులపండుగగా జరుగనుంది. శ్రీనివాసుడు ధగధగా మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం శ్రీనివాసునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. స్వర్ణమయమైన రథంలో శ్రీభూదేవేరులతో మలయప్ప దర్శనమిస్తాడు. ఇతర వాహనాల ముందు సాగే బ్రహ్మశూన్యరథం, గజ, అశ్వ, వృషభాదుల సంరంభం ఈ స్వర్ణ రథోత్సవంలో కూడా ఉంటుంది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శ‌నివారం రాత్రి 8 నుండి 10 గంటల వరకు వేంకటాద్రీశుడు గజ వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహ‌న‌సేవ ద‌ర్శ‌నం వ‌ల్ల క‌ర్మ విముక్తి క‌లుగుతుంద‌ని పురాణాల ద్వారా తెలుస్తోంది.

శ్రీ వేంకటేశ్వరస్వామి గజవాహనారూఢుడై తిరువీధులలో తిరగడం భక్తులకు మరపురాని దృశ్యం. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ప్రతిరోజూ బ్రహ్మోత్సవాలలో వాహనసేవ సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి. బ్రహ్మరథం వెనుక అశ్వాలు, వృషభాలతో ఠీవిగా ఈ గజాలు కూడా నడిచివస్తాయి.కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన ఆదివారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 8 నుండి 10 గంటలకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు ద‌ర్శ‌న‌మిస్తారు

Related posts

వలస బ్రతుకులు

Satyam NEWS

మునుగోడు గెలుపే లక్ష్యంగా పువ్వాడ దళం

Murali Krishna

వలలో జల దేవత: పాకిస్తాన్ జాలరులు రాత మార్చిన క్రోకర్ ఫిష్

Satyam NEWS

Leave a Comment