అర్సెలర్ మిట్టల్ గ్రూప్ సంస్థల చైర్మన్ ఆదిత్య మిట్టల్ బుధవారం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ను సందర్శించారు. విశాఖపట్టణం పోర్టు ట్రస్ట్ డెప్యూటీ చైర్మన్ పి. ఎల్ హరనాథ్ ఆదిత్య మిట్టల్ టీమ్ కు సాదర స్వాగతం పలికారు. పోర్టు లో జరుగుతున్న కార్యకలాపాలను వివరించేందుకు పోర్టు పర్యటనను అధికారులు ఏర్పాటు చేశారు.
పోర్టు డెప్యూటీ చైర్మన్ పి. ఎల్ హరనాథ్ పోర్టు లో జరుగుతున్న కార్యకలాపాలను వారికి వివరించారు. అనంతరం విశాఖపట్నం పోర్డు డెప్యూటీ చైర్మన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పోర్టు కార్యకలాపాలను వారికి వివరించారు. పోర్టులో ఉన్న మౌలిక వసతులు, సరుకు రవాణా కు ఉన్న సదుపాయాలు, ఆధునికీకరణ, యాంత్రీకరణ, కవర్డ్ స్టోరేజి సదుపాయం, సోలార్ పవర్, పోర్టు అంతర్గత అవసరాలకోసం వినియోగిస్తున్న నీటి శుద్ధి కేంద్రం, పెట్టుబడుల అవకాశాలు, ఎగుమతి, దిగుమతులు వంటి అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు.
వీటితో పాటుగా విశాఖపట్నం పోర్టు ట్రస్టులో ఇటీవలే చేపట్టిన పలు అంశాలను కమిటీకి వివరించారు. కేప్, సూపర్ కేప్ నౌకలను ఇన్నర్ హార్బర్ లోకి తీసుకువచ్చేందుకు సింగపూర్ లో చేపట్టిన అనుకరణ అధ్యయనం గురించి కమిటీకి వివరించారు. విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ లో జరుగుతున్న కార్యకలాపాల పట్ల ఆదిత్య మిట్టల్ ఆనందం వ్యక్తం చేశారు. పోర్టు చేపడుతున్న అభివృద్ధి పనులను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోర్టు విభాగాల అధిపతులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.