ఎల్లారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రజలందరూ విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ కోరారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని మోడల్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను, స్ట్రాంగ్ రూమ్ లను మంగళవారం ఆయన పరిశీలించారు.
పోలింగ్ రోజున ఫ్లయింగ్ స్క్వాడ్, స్ట్రైకింగ్ ఫోర్స్ పర్యవేక్షణ ఉంటుందని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను మొత్తం 11,993 ఓటర్లు ఉన్నారని అందులో పురుషులు 5,781 కాగా, 6,212 మహిళలు ఉన్నారని ఆయన తెలిపారు. మొత్తం 24 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని అన్నారు.
ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. జనవరి 25న ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ మోడల్ డిగ్రీ కాలేజీలో జరుగుతుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు పాల్గొంటున్నారని ఓటర్లకు ఎక్కడ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ ఉంటుందని, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి జిల్లా స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటర్లకు 100% పోలింగ్ స్లిప్పుల పంపిణీ జరిగిందని, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 24న కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, జిల్లా స్పెషల్ ఆఫీసర్ వెంకటేష్ దొత్రే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పి శ్వేతా రెడ్డి, ఆర్ డి ఓ దేవేందర్ రెడ్డి, కమిషనర్ రాజు వీర్, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.