టియుడబ్ల్యుజెతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. మార్చి 8 న ఎన్టీఆర్ గార్డెన్లో నిర్వహించే సభ పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు.
దాంట్లో భాగంగా నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సభకు సంబందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయనకు జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో మొక్కలు నాటారు. టీజేఏ నుంచి పలువురు జర్నలిస్టులు టియుడబ్ల్యూజే లో చేరారు.
ఈ సందర్బంగా అల్లం నారాయణ మాట్లాడుతూ… గతంలో జర్నలిస్టుల కోసం 10 కోట్ల నిధులు ఉండేవని ప్రస్తుతం ఆ నిధులు 100 కోట్లకు చేరాయన్నారు. గడిచిన ఆరేళ్ళ కాలంలో సుమారు 40 కోట్ల రూపాయలు జర్నలిస్టులకు వివిధ రూపాల్లో అందాయని చెప్పారు. దాదాపు 18 వేల అక్రిడిటేషన్ కార్డులు సంపాదించుకోవడం జరిగిందని తెలిపారు. హెల్త్ కార్డుల ద్వారా కార్పోరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని పేర్కొన్నారు.
ఇక మిగిలింది ఇళ్ల స్థలాల విషయమేనని చెప్పారు. మార్చి 8 న జరిగే సభ తర్వాత ఇళ్ల స్థలాల విషయాన్ని కొలిక్కి తీసుకువస్తామని స్పష్టం చేశారు. కేవలం టియుడబ్ల్యూజే ద్వారా మాత్రమే ఇవన్నీ సాధ్యం అయ్యాయని చెప్పారు. టియుడబ్ల్యూజే ఎప్పుడు ఏ పార్టీకి కొమ్ము కాయలేదన్నారు. అనుకున్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్న ఏకైక యూనియన్ తమదని మార్చి 8 న జరగబోయే సభకు కామారెడ్డి జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులు హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే జెనరల్ సెక్రటరీ సాగర్, విష్ణు, జిల్లా నాయకులు జమాల్ పూర్ గణేష్, బాలార్జున్ గౌడ్, భాస్కర్, అంజి, దశగౌడ్, అంజల్ రెడ్డి, రాము తదితరులు పాల్గొన్నారు