రాజధాని తరలింపు నిర్ణయం నేపథ్యంలో ఇంతకాలం కొత్త భవనం లీజుకు తీసుకోవాలో వద్దో తెలియక తికమక పడిన ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు అమరావతి ప్రాంతంలోనే మరో భవనంలోకి మారింది. నాలుగేళ్లుగా తాడేపల్లి లో కొనసాగుతున్న ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం నుంచి మంగళగిరి 6వ బెటాలియన్ రోడ్డు(శ్రీరామ్నగర్-ఆత్మకూరు గ్రామం)లోని నీలాద్రి టవర్-3,4,5 అంతస్థులలోకి తరలింది.
ఇక నుంచి మండలి కార్యకలాపాలు అక్కడ నుంచే నడుస్తాయి. లీజు ఒప్పందం మేరకు దాదాపు రూ.25లక్షలు అద్దెకింద అడ్వాన్స్ గా చెల్లించిన మండలి, గత డిసెంబరులోనే కొత్త భవనంలోకి తరలించాల్సి ఉంది. అయితే రాజధాని మార్పుపై కొంత ఊగిసలాడినప్పటికీ ఎట్టకేలకు కొత్త భవనంలోకి మార్చారు.