రాజధాని పర్యటనలో భాగంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై జరిగిన దాడికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతం సవాంగ్ బాధ్యత వహించాలని కింజారపు అచ్చెంనాయుడు అన్నారు. శుక్రవారం విజయవాడ కేశినేని భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై జరిగిన దాడిని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధానిని రాష్ట్రానికి, దేశానికి చూపించాలనే చంద్రబాబు పర్యటించారని తెలిపారు.
ఆ సందర్భంలో కొంతమంది వైసిపి కార్యకర్తలు చంద్రబాబు బస్సు పై చెప్పులు, రాళ్లతో దాడి చేశారని ఈ ఘటనను టిడిపి శాసన సభా పక్షం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుపై జరిగిన దాడికి సిఎం జగన్, డిజిపి సవాంగ్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఘటన అనంతరం డిజిపి ప్రకటన చూసిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాలు ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మేము పర్యటన చేస్తే.. మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు.
మా బస్సుపై పోలీసులు లాఠీ కూడా విసిరారు.. అది ఎవరు వేశారో డిజిపి చెప్పాలన్నారు. భావప్రకటనా స్వేచ్చ అందరికీ ఉంటుంది అని డిజిపి అంటున్నారు. నిరసనకు అవకాశం ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నాం అన్నారు. రేపటి నుంచి అందరికీ ఇదే విధంగా నిరసన తెలిపే అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. జగన్ పర్యటనలో కూడా తాము నిరసనలు తెలుపుతాం అని హెచ్చరించారు. వీటికి డిజిపి అనుమతి ఇవ్వకపోతే.. ఆయన్ను వైసిపి కార్యకర్తగా పరిగణిస్తాం అని వ్యాఖ్యానించారు. మంత్రి బొత్స పక్కన అనువాదకుడిని పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. టిడిపి ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తే.. తమపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై దాడి ఘటనను పార్లమెంటులో కూడా ప్రస్తావిస్తాం అన్నారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పార్టీ సినియర్ నేత వర్ల రామయ్య తదితరులు కూడా మాట్లాడారు.