కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నదని అందులో భాగంగా ఆటోలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగేందుకు అనుమతి లేదని డిఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు ఆయన కడప సబ్ డివిజన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు పోలీసు శాఖ తరపున సూచనలు చేశారు.
అత్యవసరం అయితే100 కి కాల్ చేస్తే పోలీసు శాఖ తరవున సేవలు అందిస్తామని ఆయన తెలిపారు. రేపటి నుంచి ఆటోలు బయట తిరిగితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన ఆటోలపై జరిమానాలతో పాటు వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన ప్రకటించారు. ఇళ్లలో తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపద్దని ఆయన కోరారు. గ్రౌండ్ లో క్రికెట్ ఆడేందుకు, ఇతర పనులకు బయటకు పంపడం ప్రమాదకరమనే విషయం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని వీలైనంత వరకు ఇళ్లలో ఉండేందుకు చూడండని ఆయన కోరారు.