హైదరాబాద్ మెట్రో రైల్ బోగీల్లో, మెట్రో స్టేషన్ ప్రాంగణాలలో చేయాల్సిన, చేయకూడని పనుల పట్ల అవగాహన కల్పించే సివిక్ సెన్స్ కార్యక్రమాన్ని స్టార్మా, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ సంయుక్తంగా తెలుగు వినోద ప్రపంచంలో అతిపెద్ద టెలివిజన్ ప్రోపర్టీ అయిన బిగ్ బాస్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీబీ3 హోస్ట్ నాగార్జునతో పాటుగా స్టార్మా నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఎల్టీఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవో కెవీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ పౌరస్పృహ కార్యక్రమాన్ని నగరంలోని 48 మెట్రో స్టేషన్లలోని కాన్కోర్స్, ఫ్లాట్ఫామ్ లెవల్, రిటైల్ స్పేస్ను కవర్ చేస్తూ చేయనున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్తో పాటుగా అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేయనున్నారు. ఈ క్యాంపెయిన్ను మొత్తం బిగ్బాస్ సీజన్లో కొనసాగిస్తారు. ప్రయాణంలో భద్రతా ప్రమాణాలు, మెట్రో నిబంధనలు, తమ సౌకర్యం కోసం సరైన విధానంలో మరింతగా సమర్ధంగా వినియోగించడం వంటి అంశాల పట్ల అవగాహన కల్పించడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశ్యం.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బిగ్బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ముఖ్యమైన సమాచారాన్ని ఈ వినోద కార్యక్రమం ద్వారా అందిస్తున్నామని అన్నారు. సమాజానికి అవసరమైన సందేశం అందించడం కోసం బిగ్బాస్ ప్లాట్ఫామ్ను సృజనాత్మకంగా వినియోగిస్తున్నామని, ఈ ప్రచారాన్ని మెట్రో ప్రయాణీకులతో పాటు ప్రజలంతా కూడా బాగా ఆదరించాలని అన్నారు.
ఎల్అండ్టీ మెట్రోరైల్ హైదరాబాద్తో ఈ భాగస్వామ్యం గురించి స్టార్ మా నెట్వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్ మాట్లాడుతూ ఈ ప్రచారానికి మెట్రోరైల్తో కలిసి ముందుకు రావడం పట్ల తాము ఆనందంగా ఉన్నామని చెప్పారు. మా అతిపెద్ద ప్రోపర్టీ షోలలో ఒకటైన బిగ్బాస్ నేపథ్యం ఉపయోగించి మెట్రో రైల్ వినియోగానికి సంబంధించి అతి ముఖ్యమైన సందేశాన్ని దీనిద్వారా ప్రజలకు అందిస్తున్నామని అన్నారు.
ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ అండ్ సీఈవొ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ మెట్రో రైల్ను లక్షలాది మంది ఎక్కువగా ఇష్టపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. తోటి ప్రయాణీకుల భద్రత, సౌకర్యం కోసం అనుసరించాల్సిన ప్రయాణ మర్యాదను గురించి అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని అందుకే ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన అన్నారు. మాకు వాట్సాప్పై ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి, అలాగే సోషల్మీడియా, మీడియా ద్వారా మెట్రోలో ప్రయాణీస్తున్న సమయంలో ప్రయాణీకులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఫిర్యాదులు ఉంటున్నాయి.
వీటిలో సీనియర్ సిటిజన్ లేదా లేదా లేడీస్ సీట్లను ఖాళీ చేయకపోవడం, బ్యాక్ ప్యాక్స్ను నేలపై ఉంచకపోవడం, ఎల్లో లైన్ తరువాత నిల్చోవడం మొదలైనవి ఉంటున్నాయి. ఈ వినూత్నమైన ప్రచారం ద్వారా హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణ సమయంలో చేయాల్సిన, చేయకూడని అంశాల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.