వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదరాబాదరా ప్రవేశ పెట్టిన వికేంద్రీకరణ, సీఆర్ డీ ఏ ఉపసంహరణ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపింది. బిల్లును అసెంబ్లీకి తిప్పి పంపకుండా సెలెక్టు కమిటీకి పంపడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లుగా అయింది. బిల్లును తిరిగి అసెంబ్లీకి పంపేందుకు వీలులేకుండా హేయమైన చర్యకు చంద్రబాబునాయుడు పాల్పడ్డారని ఆర్ధిక శాసన వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని, గంటన్నర పాటు మండలి గ్యాలరీలో ఉన్న చంద్రబాబు నాయుడు బిల్లును ప్రభావితం చేశారని మంత్రి అన్నారు.
బిల్లును సెలెక్టు కమిటీకి పంపడంపై వైసిపి సభ్యులు తీవ్రంగా విమర్శిస్తుండగా తెలుగుదేశం సభ్యులు కౌన్సిల్ చైర్మన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. చట్ట సభలపై గౌరవం లేకుండా చంద్రబాబు ప్రవర్తించారని మంత్రి అన్నారు. లాబీ లో కూర్చుని చంద్రబాబు ప్రభావితం చేశారని, రాష్ట్రాభివృద్ధి కోసం రెండు బిల్లులు తీసుకువచ్చామని వాటిని ఆపడం అన్యాయమని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. చట్టసభల చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని ఆయన వ్యాఖ్యానించారు.