ఎవరు చేశాడో తెలియదు కానీ ఇంటర్ చదువుతున్న ఒక అమాయిని అతి కిరాతకంగా చంపాడు. కరీంనగర్లోని విద్యానగర్లో ఈ ఘటన జరిగింది. ముత్తా రాధిక ఇక్కడి సహస్ర జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. విద్యానగర్లోని పద్మావతి ఫంక్షన్ హాల్ వెనుక భాగంలో రాధిక ఉంటుంది.
రాధిక తల్లిదండ్రులు రోజు కూలీలుగా పనిచేస్తున్నారు. ఆమెను ఇంట్లో నే అగంతకుడు ఆమె గొంతు కోసి హత్య చేశాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి రక్తపుమడుగులో కుమార్తె పడి ఉంది. ఒక్క సారిగా వారు నిర్ఘాంతపోయి తీవ్ర ఆవేదనతో బోరున విలపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.
అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పోలీసు జాగిలాలతో ఘటన జరిగిన ప్రాంతంలో తనిఖీ చేశారు. అగంతకుడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి అగంతకుడి కోసం గాలిస్తున్నారు.