అధికారం లేకపోవడంతో ఏపి మాజీ సిఎం చంద్రబాబునాయుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి. ఏపి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రజలు రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని పాపం చంద్రబాబునాయుడు మనసులో ఏమనుకుంటున్నారో కానీ బహిరంగంగా చెప్పేశారు. అధికారం కోల్పోయి కేవలం 100 రోజులే అయినా ఆయన తాళలేకపోతున్నట్లున్నారు. రివర్స్ టెండరింగ్ కు బదులు రివర్స్ ఎన్నికలు వస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ న్యాయ విభాగం ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రివర్స్ ఎన్నికలు మాత్రం రావు కానీ, మూడేళ్లలో జమిలి ఎన్నికలు రావొచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి న్యాయవిభాగం వెన్నుదన్నుగా నిలబడిందని, అప్పటి ప్రభుత్వ అరాచకాలపై పోరాడిందని గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అంతకు మించిన అరాచకాలు జరుగుతున్నాయని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తమ హయాంలో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతికి శ్రీకారం చుడితే దాన్ని పురిట్లోనే చంపేశారని వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. అవినీతిలో చిక్కుకుపోయి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లిన వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా సీఎం జగన్ పై ఆరోపణలు గుప్పించారు.
previous post
next post