ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తనను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కసరత్తు ప్రారంభించారు. శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆయన ఈ మేరకు బుధవారం ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనధికార కాలనీలకు మౌలిక సదుపాయాల కల్పన, చెత్త రహిత ఢిల్లీ, అంతరాయం లేని విద్యుత్ సరఫరాతో సహా తాను ఇచ్చిన 10 హామీల అమలుపై ఈ సందర్భంగా చర్చిస్తారు.
సమాజంలోని వేర్వేరు వర్గాలకు పైపుల ద్వారా తాగునీరు, ప్రతి చిన్నారికి విద్య, ఉచిత బస్సు ప్రయాణ పథకం, ఆరోగ్య రక్షణ సదుపాయాలు, మహిళా భద్రత, యమునా నది శుభ్రం చేసే కార్యక్రమం వంటి అంశాలు అజెండాగా బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరగనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ ఆదివారం ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలోని వేర్వేరు విభాగాల ఉన్నతాధికారులతో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి