దిశ హత్య కేసుకు సంబంధించిన ఎన్ కౌంటర్ లో మరణించిన నలుగురి డెడ్ బాడీలను ఎంత కాలం కాపాడాలి? ఈ ప్రశ్నకు సమాధానం లేకపోవడంతో గాంధీ ఆసుపత్రి అధికారులు అయోమయానికి గురవుతున్నారు. పోలీసుల ఎన్ కౌంటర్ లో ఆ నలుగురు చనిపోయిన తరువాతి రోజు ఆ నలుగురి మృతదేహాలను ఖననం చేయాలని భావించినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల వీలుపడలేదు.
హై కోర్టు ఆదేశాల మేరకు మృతదేహాలను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ లో భద్రపరిచారు. అయితే మరిన్ని రోజులు ఉంచాల్సి రావడంతో ఆ డెడ్ బాడీలను హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. నిజానికి ఆ మృతదేహాలను ఈనెల 13 వరకే భద్రపరచాలి అని ముందుగా అనుకున్నప్పటికీ, ప్రస్తుతానికి ఆ కేసు విషయమై సుప్రీం కోర్టు విచారణ జరుగుతుంది.
వాటిని భద్రపరచడానికి మరికొంత సమయం కావాలని ఆదేశాలు వచ్చాయి. అయితే గాంధీ ఆసుపత్రిలో ఆ మృతదేహాలను ఎంత ఫ్రీజింగ్ లో భద్రపరచినప్పటికీ కూడా ఎంతో కొంత సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. చివరికి అవి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇక వాటిని భద్రపరచడం తమ వల్ల కాదని గాంధీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఒకవేళ అవి కుళ్ళిపోతే వాటికి రీపోస్టుమార్టం జరపడానికి అవకాశం ఉండదని చెబుతున్నారు వైద్యులు.
కాగా ఈమేరకు వాటిని ఢిల్లీకి తరలించడానికి అనుమతిని ఇవ్వాలని గాంధీ ఆసుపత్రి సిబ్బంది తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ఎందుకంటే ఢిల్లీ ఎయిమ్స్ లో ఎన్నిరోజులైనా ఫ్రీజింగ్ చేసుకునే సౌకర్యం ఉన్నది. అక్కడ మృతదేహాలను ఎన్ని రోజులు పెట్టినప్పటికీ కూడా వాటికీ ఎలాంటి నష్టం జరగదని గాంధీ ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు.