ఈనెల 2న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన విలేకరుల పై దాడి ఘటన పై జర్నలిస్టు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ వేయనున్నట్టు జర్నలిస్టు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆనంచిన్ని వెంకటేశ్వర్రావు ఒక ప్రకటనలో తెలియజేశారు.
మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్బాబు పై వరస కథనాలు ప్రచురించి, కథనాలు ఆపేందుకు 30 లక్షలు డిమాండ్ చేసి, 15 లక్షలకు భేరమాడి 5 లక్షలకు ఒప్పుకొని 3 లక్షలు తీసుకొని వెళుతుంటే తమ బంధువులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారని మువ్వా ఆరోపణ.
ఆయన ఫిర్యాదు మేరకు విలేకరులయిన మూర్తి, సత్యనారాయణ, శ్రీకాంత్ పై కేసు రిజిస్టర్ చేశారు. ఒక బెయిబుల్, మరో నాన్ బెయిబుల్ సెక్షన్ నమోదు చేశారు. కాగా వార్త కథనం పై వివరణ ఇస్తామని స్థానిక విలేకరి ద్వారా తమకు కబురు పంపారని బాధిత విలేకరులు చెబుతున్నారు.
దురుద్ధేశపూర్వకంగా తమను గెస్ట్ హౌజ్కు పిలిపించి, నాటకీయంగా తమ పై దాడి చేశారన్నది బాధిత జర్నలిస్టుల ఆవేదన. దీనిపై జర్నలిస్టు సంఘాల డిమాండ్ మేరకు మువ్వా పై బెయిబుల్ సెక్షన్తో కేసు నమోదు చేశారు. అయితే సంఘటన జరిగిన తెల్లారి తొలుత జెఎస్ఎస్ బాధితులను పరామర్శించి విషయాలను తెలుసుకుంది.
ఆరోజు కారణాకారణాలు తెలుసుకునే సమయం, సందర్భం కాదన్న ఉద్ధేశ్యంతో బాధితలకు ఆత్మ విశ్వాసాన్ని కల్పించి సోషల్ మీడియాలో ఎవరూ అవాంచనీయ కథనాలు రాయొద్దని అభ్యర్ధించాం. అదే క్రమంలో సంఘటన పై భిన్న అభిప్రాయాలు వెలుగుచూస్తున్నాయి.
కేవలం తమను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజడానికే వార్తా కథనాలు ప్రచురించారనేది మువ్వా వాదన, దానికి తోడు ప్రత్యర్ధి సాయంతో బురద చిమ్మి సొమ్ము చేసుకోవానుకుంటున్నారని, తన కుటుంబ, వ్యక్తిగత విషయాలు కల్పించి రాశారనేది ఆయన కథనం.
తమకు ఉన్న సోర్స్తో కథనాలు రాస్తుంటే, అక్రమాలు బయటపెడతామని భయపడి పిలిపించి దాడి చేశారనేది బాధిత జర్నలిస్టుల కథనం. ఇరు వర్గాల కథనాలు భిన్న కోణంలో ఉన్న నేపద్యంలో వాస్తవాన్ని వెలికితీసేందుకు జెఎస్ఎస్ స్వచ్ఛందంగా నడుంబిగించింది.
ఇది కేవలం ఇప్పుడు బాధిత జర్నలిస్టుల కోసం మాత్రమే కాదు. బ్లాక్ మెయిల్ ముద్ర వేసి బాధించబడుతున్న అందరు జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన కమిటి. దీనిలో 1. సదరు జర్నలిస్టులు నిజంగా బ్లాక్మెయిల్కు దిగారా ? పత్రికా విలువలను పాటించకుండా వ్యవహరించారా? మిగతా పాత్రికేయులకు భిన్నంగా వ్యవహరించారా ?
2. వరుస కథనాల్లో వాస్తవాలు ఎన్ని ? కుటుంబ వ్యవహారాన్ని రచ్చకీడ్చిన విషయం వాస్తవమేనా ? 3. సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టిన వీడియోలో కొన్ని అంశాలు మాత్రమే ఎందుకున్నాయి. అందులో హుందాగానే ఉన్నపుడు దాడికి దారితీసిన పరిస్థితులేంటి?
4. ఒకసారి ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అయిన తరువాత ( ఐపీసీ సెక్షన్ 307 )హత్యాయత్నం సెక్షన్ యాడ్ చేసే అవకాశాలు ఉంటాయా ? బెయిబుల్ సెక్షన్ ఉన్నపుడు అరెస్ట్ డిమాండ్ ఆచరణ సాధ్యమా ? 5. బాధిత జర్నలిస్టు పై పెట్టిన రెండు సెక్షన్ అట్రాక్ట్ అయ్యే సెక్షన్లేనా.. దాడి ఘటనకు ప్రత్యక్ష సాక్షులున్నారా ?
ఇరు పక్షాల ఆరోపణలు బలపరిచే ఆడియో వీడియో సాక్ష్యాలు ఎవరి వద్ద ఉన్నాయి. ఫోన్లు ఎందుకు లాక్కున్నారు. వాటిల్లో డేటా ఏమయ్యింది. 6. సంఘటనకు సంబంధం ఉన్న అధికారులను, అనధికారులను, బాధితులను/ నిందితులను కలిసి వివరాలు సేకరించే ప్రయత్నం చేయబోతోంది జెఎస్ఎస్.
7. మూక్కూ మొహం తెలియని డిమాండ్ కాకుండా న్యాయబద్దమైన, ఆచరణ సాధ్యమైన, డిమాండ్ను ప్రభుత్వం ముందు ఉంచబోతోంది, అదే క్రమంలో పాత్రికేయులే నిజంగా తప్పు చేసినట్టు రిపోర్ట్లో తేలితే జెఎస్ఎస్ రిపోర్ట్ ప్రజాక్షేత్రంలో విడుదల చేస్తాం, ప్రచురిస్తాం.
దాడికి పాల్పడినదే నిజమైతే అక్రమాల పుట్టను కదిలించి జర్నలిస్టుల పెన్ పవరేంటో చూపుతాం. పవిత్రమైన పాత్రికేయ వృత్తిని నమ్ముకున్న జర్నలిస్టును కాపాడటమే మా లక్ష్యం. ఇందులో బేషజాలు, రాజకీయాలు, ప్రచారాలు, ఎత్తుగడలు జెఎస్ఎస్కు అవసరం లేదు.
పాత్రికేయ వృత్తిలో నమ్మక ద్రోహలు, ఊసరవెల్లులు, నకిలీలు, కోవర్టులు ఉంటే వారి బండారం కూడా సాధ్యమైనంత వరకు బయటపెట్టే ప్రయత్నం చేస్తాం. ఇది రాష్ట్ర కమిటీ నిర్ణయం . మొదటి నిజనిర్ధారణ సత్తుపల్లి ఘటన నుంచే మొదలు పెట్టబోతున్నాం.
ఈ కమిటీలో ఒక న్యాయవాది .. ఒక సీనియర్ మోస్టు జర్నలిస్టు … రిటైర్డ్ పోలీస్ అధికారి.. సత్తుపల్లి స్థానిక పాత్రికేయుడు ఒకరు… వర్తమాన పాత్రికేయులు ఓ ముగ్గురు సాయం తీసుకోనున్నాం. ఈ కమిటీలో విచారణ నిమిత్తం జరిగే ఖర్చులన్నీ సంఘం భరిస్తుంది.
వారికి రవాణా ఖర్చు, భత్యం. నిజనిర్ధారణకు కేటాయించిన అన్ని రోజులు హానరోరియం ఇస్తాము. కమిటీ నిజనిర్ధారణ జరినన్ని రోజు సంఘం అధికార ప్రతినిధి అయితగాని జనార్ధన్ కన్వీనర్గా వ్యవహరిస్తారు.
ఈ కమిటీ అదే రోజు అర్బన్ పోలీస్ స్టేషన్లో మరో పాత్రికేయుడి పై నమోదైన కేసు పై కూడా విషయాలు తెలుసుకోనుంది. ఇది పూర్తిగా స్వచ్ఛంద సేవ.