కరోనా ను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తే ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు అన్నారు. గురువారం నాడు సంగారెడ్డి కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్లో కరోనా వైరస్ నివారణకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏప్రిల్ 15 వరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉంటూ తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరించారు. ఎవరి ఇంటిలో వారే ఉన్నట్లయితే మన కుటుంబాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడుకున్న వాళ్లమవుతామని ఆయన అన్నారు.
సంగారెడ్డి పట్టణంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అధికారుల సూచనలు పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉంటూ ఎవరికైనా జలుబు దగ్గు లాంటి ఉంటే వైద్యాధికారులను సంప్రదించాలని మంత్రి హరీష్ రావు ప్రజలకు సూచించారు.
సంగారెడ్డి జిల్లా నుండి 21 మంది ఢిల్లీ ప్రార్ధనల్లో పాల్గొన్నారని వారందరిని గుర్తించి క్వారంటైన్ కు తరలించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు, ఎస్ పి చంద్రశేఖర్ రెడ్డి ఆదనపు కలెక్టర్ రాజశ్రీ షా తదితరులు పాల్గొన్నారు.