ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల పరిస్థితిని ఎంపీపీ జి.సుధారాణి రత్న ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో నిద్రాహారాలు మాని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పని చేస్తున్న జర్నలిస్టుల పట్ల ఆమె తన గౌరవాన్ని సూచించేలా నేడు నిత్యావసర వస్తువులను, మాస్కులు పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటి వరకూ ఏ ప్రజా ప్రతినిధి కూడా విలేకరుల పట్ల ఇంత సానుకూలంగా ప్రవర్తించలేదు. నలుగురు బాగుంటేనే మనం బాగుంటాం అనే మనస్తత్వం కలిగిన జన నాయకుడు, స్వర్గస్తులు రత్న ప్రభాకర్ రెడ్డి ఆలోచనలను, సిద్ధాంతాలను ఆయన సతీమణి ఎంపీపీ గాదెల సుధారాణి పాటిస్తున్నారు.
కొల్లాపూర్ ప్రాంతంలో జర్నలిస్టులకు రత్న ప్రభాకర్ రెడ్డి ఎంతో సన్నితంగా వుండే వారు. అదే స్వభావంతో ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో జర్నలిస్టుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఆయన సతీమణి ఎంపీపీ గాదెల సుధారాణి కొల్లాపూర్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు 25 కేజీల A1 బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
అదే విధంగా మాస్కులు కూడా అందచేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎంపీపీ గాదెల సుధారాణికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
మొత్తం 35 మంది విలేకరులకు ఈ విధంగా నిత్యావసరాలు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎంపిడివో కృష్ణయ్య, ఎంపీవో గంగ మోహన్, రమేష్ తదితరులతో బాటు సిబ్బంది పాల్గొన్నారు.