ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు టిటిడి తరఫున అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. జెఈవో పి.బసంత్కుమార్ పర్యవేక్షణలో తొలిరోజు శనివారం 15 వేల పులిహోర పొట్లాలను టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో సిద్ధం చేశారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వద్దగల క్యాంటీన్లో ఈ మేరకు ఆహార పొట్లాలను రెవెన్యూ, తుడ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు అందజేశారు. పొంగళ్, పెరుగన్నం, టమోటా రైస్, బిసిబెళా బాత్, కిచిడీ తదితరాలతో కూడిన మెనును రోజుకొకటి చొప్పున తయారుచేస్తారు.
ప్రతిరోజూ మధ్యాహ్నం 30 వేల పొట్లాలు, రాత్రి 15 వేల పొట్లాలను తయారు చేసేందుకు టిటిడి అధికారులు ప్రణాళిక రూపొందించారు. రెవెన్యూ, తుడ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తమ సిబ్బంది సాయంతో తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, రెండో సత్రం, తిరుచానూరులోని శ్రీ పద్మావతి నిలయం వద్ద ఆహార పొట్లాలను అవసరమైన వారికి అందిస్తారు.
అన్నప్రసాద విభాగం డెప్యూటీ ఈవోలు నాగరాజ, లక్ష్మణ్నాయక్, డెప్యూటీ ఈఓ గోవిందరాజన్, క్యాటరింగ్ అధికారి సాయిబాబారెడ్డి, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆర్ఎస్.గోపాల్ తదితరులు ఆహారపొట్లాల తయారీని పర్యవేక్షించారు.