వలస కూలీల ఆకలి తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం మొదటి విడతలో జిల్లా కేంద్రమైన సిద్ధిపేట- మందపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన డీఎక్స్ఎన్ పరిశ్రమ వద్ద ఉన్న క్యాంపులో 360 మందికి ఆయన ఆహారం, నగదు అందచేశారు.
అలాగే నర్సాపూర్ డబుల్ బెడ్ రూమ్ వద్ద క్యాంపులో 320 మంది, అదే విధంగా గజ్వేల్ పట్టణ శివారు ముట్రాజ్ పల్లి క్యాంపులో 680 మందికి, మర్కుక్ లోని క్యాంపులో 300 మందికి, తునికి-బొల్లారం క్యాంపులో 600 మందికి మొదటి విడతగా ఏర్పాటు చేసిన క్యాంపులో ఆయన 12 కిలోల బియ్యం, రూ.500 రూపాయల నగదు అందజేశారు.
జిల్లాలోని వివిధ ప్రాజెక్టు సైట్లలో మొత్తంగా పని చేసే 10 వేల 300 మంది వలస కార్మికులు ఉన్నారని విడతల వారీగా అందరికీ అందజేస్తామని మంత్రి చెప్పారు. జిల్లాలోని వలస కూలీలు ఉన్నచోటే ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామని మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా చెప్పారు.
రేషన్ కార్డు లేకపోయినా ఒక్కో వలస కూలీకి రూ.500 ఇస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రంలో ఒక్కరు కూడా ఆకలితో ఉండొదన్నదే సీఏం కేసీఆర్ ప్రధాన ధ్యేయమని మంత్రి తెలిపారు. మీకు ఏదైనా జ్వరం, దగ్గు వస్తే మా దృష్టికి తీసుకువస్తే మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లి వైద్యం అందిస్తాం.
మీరు చెప్పకపోతే మీకే నష్టం వాటిల్లుతుంది. మీరు ముందే మాకు చెబితే మీకు కావాల్సిన వైద్యం అందిస్తాం. మేము చత్తీస్ ఘడ్, బీహార్, ఓడిశా రాష్ట్రాల నుంచి వచ్చామని తెలంగాణ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అనుకుకోవద్దు. మీరు కూడా మా కుటుంబ సభ్యులేనని మిమ్మల్ని కూడా మంచిగ చూసుకుంటాం అని హరీష్ రావు వివరించారు.