హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధికి మద్దతు ఉపసంహరణపై సిపిఐ తీసుకునే నిర్ణయం భారీ ప్రభావం చూపించనుంది. హుజూర్ నగర్ రూరల్, గరిడేపల్లి, నేరేడు చర్ల మండలాలలో సిపిఐకి గణనీయమైన బలం ఉంది. ఈ మూడు మండలాలలో సుమారు 20 వేల ఓట్లు సిపిఐ కి ఉన్నాయి. పార్టీ పట్ల అంకిత భావంతో ఉండే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పార్టీ నిర్ణయం ప్రకారమే ఓట్లు వేస్తారు. పార్టీ నిర్ణయం టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటే దాదాపు 15 వేల నుంచి 20 వేల ఓట్లు ఆ పార్టీకి వచ్చేసినట్లే. అందుకే ఎన్నిక ప్రచారం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దూతలతో కబురు పంపి సిపిఐ పార్టీని సెట్ చేసుకున్నారు. అయితే ఆ తర్వాతి కాలంలో ఆర్టీసీ సమ్మె ప్రారంభం కావడం, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు సిఎం కేసీఆర్ అంగీకరించకపోవడం తదితర కారణాలతో కార్మికలోకం అంతా సమ్మె చేస్తున్నసమయంలో సిఎం కేసీఆర్ ను బలపరచడం ఆత్మహత్యాసదృశ్యమని సిపిఐ లోని బలమైన వర్గం భావిస్తున్నది. ఆర్టీసీ సమ్మెకు ముందు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐలోని బలమైన వర్గం వాదిస్తుండటంతో సిపిఐ అధిష్టానం సంకట స్థితిలో పడిపోయింది. దాంతో టిఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచనలో పడింది. టిఆర్ ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో మద్దతు ఇచ్చే విషయం పై సిపిఐ వెనక్కుతగ్గితే టిఆర్ఎస్ అభ్యర్ధి విజయావకాశాలపై పెను ప్రభావం పడుతుంది.
previous post
next post