అధికార పార్టీ వేధింపులపై అవసరమనుకుంటే స్వయంగా వచ్చి తాడేపల్లిగూడెంలో కూర్చొంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ శ్రేణుల కోరిక మేరకు అవసరమైతే గూడెంలో పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అమరావతిలో తాడేపల్లిగూడెం ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ నేతృత్వంలో ఆదివారం పవన్ కల్యాణ్ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనాన్ని జనసేన కార్యకర్తలు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపిన తర్వాత మునిసిపల్ ఎన్నికల్లో పార్టీ విధివిధానాలను వెల్లడిస్తామని పవన్ తెలిపారు. ఆ మేరకు పార్టీ శ్రేణులు కష్టపడాలని కోరారు. సమీక్షలో గూడెం నాయకులు వర్తనపల్లి కాశీ, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమోగుల సురేశ్, మారిశెట్టి అజయ్, మారిశెట్టి పోతురాజు, అడపాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.