పార్టీలకు అతీతంగా, పరిస్థితులకు అతీతంగా ఒక సామాజిక వర్గం ఏకమైనా కూడా సింహం సింగిల్ గానే వచ్చి విజయం సాధించిందని కొల్లాపూర్ ప్రజలు అనుకుంటున్నారు. కొల్లాపూర్ మునిసిపాలిటీలో ఉన్న మొత్తం 20 స్థానాలలో 11 స్థానాలు సాధించిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక చరిత్ర సృష్టించింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వెనుక నుండి నడిపిన వ్యక్తి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అనే విషయం అందరికి తెలిసిందే.
మునిసిపల్ ఎన్నికల ప్రచార సభలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పులులకు, కుక్కలకు, పిల్లులకు జనాలు ఓట్లు వెయ్యారని అతి దారుణంగా జూపల్లి వర్గాన్ని కించపరిచారు. ఇలా తిరుగుబాటు చేసిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునే పరిస్థితి లేదని ఆనాడు ప్రచార సభల్లో మాట్లాడారు. అయితే ఎందరు ఎన్ని మాటలు మాట్లాడినా కొల్లాపూర్ ప్రజలు సింహం గుర్తుకే ఓటు వేసి 11 మంది కౌన్సిలర్లను గెలిపించారు.
నైతికంగా 20 స్థానాలలో 11 గెలుచుకున్న పార్టీకి మునిసిపల్ చైర్మన్ పీఠం దక్కాలి కానీ ఎక్స్ అఫిషియో సభ్యులతో టీఆర్ఎస్ పార్టీ ఈ పదవిని దక్కించుకుంది. మునిసిపల్ చైర్మన్ పదవి దక్కకపోయినా కూడా నైతిక విజయం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుదేని అంటున్నారు. రాబోయే రోజుల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరింత బలపడే అవకాశం ఉందని కూడా పరిశీలకులు భావిస్తున్నారు.
కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ముఖ్య నాయకులు రఘు వర్ధన్ రెడ్డి అందరూ ఏకమై వచ్చారు కానీ కేవలం 9 కౌన్సిలర్ లను మాత్రమే గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ బలంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకున్నారు. జూపల్లి ఒక్కరే పోరాడి 11 మందిని గెలిపించారు.