దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కరీంనగర్ లోని నాఖ చౌరస్తా వద్ద పోలీసులు బుధవారం నాడు రాత్రి మాక్ డ్రిల్ నిర్వహించారు. నాఖాచౌరస్తా ప్రాంతంలో ఒక సంఘటన జరిగిందని ఆ ప్రదేశానికి సత్వరం చేరుకోవాలని పోలీసు శాఖలోని వివిధ విభాగాలకు సమాచారం అందించారు.
వివిధ విభాగాలకు చెందిన పోలీసులు 20 నిమిషాల వ్యవధిలో చౌరస్తా వద్ద చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లను నిర్వహించడంతో పాటు అనుమానిత ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినట్లయితే వివిధ విభాగాలకు చెందిన పోలీసులు సంఘటన స్థలానికి ఎంత వేగంగా చేరు కుంటారు అని పరిశీలించేందుకు గాను ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి పోలీసులు చేపట్టిన వివిధ రకాల తనిఖీలు స్వయంగా పరిశీలించారు. అడిషనల్ డిసిపి (ఎల్ అండ్ ఓ) ఎస్ శ్రీనివాస్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు లతో పాటుగా క్యు ఆర్ టీ టాస్క్ ఫోర్స్,ట్రాఫిక్,సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, బాంబు డిస్పోజబుల్ స్వాడ్ లతో పాటుగా వివిధ విభాగాలకు చెందిన 250 మంది పోలీసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్, విజ్ఞాన్ రావు, నాగార్జున రావు, శశిధర్ రెడ్డి, ఎస్బిఐ ఇంద్రసేన రెడ్డి, ఆర్ఐలు మల్లేశం, జానిమియా, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.