మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తిరుమలలోని గోగర్భం తీర్థం వద్దగల రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి శుక్రవారం అభిషేకం వైభవంగా జరిగింది. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు సుగంధద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఇఓ లక్ష్మయ్య, పారుపత్తేదార్ గుర్రప్ప, ఇతర సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.