ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాజీ కేంద్ర మంత్రి, సైరా చిత్ర హీరో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సతీ సమేతంగా అమరావతి వెళ్లిన చిరంజీవి ముఖ్యమంత్రిని కలిశారు. సినిమా పరిశ్రమకు చెందిన వారిని ఎవరినీ కూడా ఇప్పటి వరకూ కలవని ఏపి సిఎం ఇప్పుడు చిరంజీవిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని తెలిసింది. కేవలం సైరా సినిమాను చూడాలని ఆహ్వానించేందుకే చిరంజీవి ఏపి సిఎం జగన్ ను కలిశారని అంటున్నారు. భేటీ సందర్భంగా సైరా సినిమా చిత్ర విశేషాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిరంజీవి వివరించారు. సైరా చిత్రం చూడాలని ఈ సందర్భంగా చిరంజీవి సీఎం జగన్ ని కోరారు. చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక వైపు జగన్ తో పోరాడుతూ ఆయనపై చార్జిషీట్ విడుదల చేయగా చిరంజీవి వెళ్లి ఆయనను కలవడం విశేషం.