నిర్మల్ జిల్లా బైంసా లో ఇటీవల జరిగిన అల్లర్ల లో నష్టపోయిన బాధితులను హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం నిర్మల్ మండలంలోని తల్వేద రోడ్డులో నూతనంగా నిర్మించనున్న బిజెపి జిల్లా కార్యాలయానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
భైంసాలో ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారిని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రెండు కుటుంబాల చేతిలో బందీ అయిందని ఆయన అన్నారు. గల్లీలో పరిమితమైన అల్లర్లను బైంసా వరకు తీసుకొచ్చిన ఘనత కెసిఆర్ దేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ అండదండలతోనే మజ్లిస్ పార్టీ అల్లర్లను సృష్టిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపై చర్చకు సిద్ధమా అని కెసిఆర్, కేటీఆర్ కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. భైంసా లో ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. అల్లర్లలో నష్టపోయిన బాధితుల వివరాలను, జరిగిన సంఘటన వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సహాయక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రెండు కుటుంబాల పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించుకునేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తల దేనని తెలిపారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ లు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, బిజెపి జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, నాయకులు తదితరులు ఉన్నారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.