ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి ఒక వ్యక్తి చనిపోయాడని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు(నాని) అసెంబ్లీలో స్పష్టం చేశారు. నిన్న గుడివాడలో సాంబిరెడ్డి అనే వ్యక్తికి గత పదిహేను సంవత్సరాల నుంచి గుండెనొప్పి ఉందని అందుకే ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడని మంత్రి చెప్పారు.
ఆయనకు మూడంతస్తుల బిల్డింగ్ ఉందని, ఆర్ధికంగా స్ధిరపడిన కుటుంబమని మంత్రి తెలిపారు. ఆయనకు పెరాలసిస్ ఉంది. నిన్న ఉదయం గుడికి వెళ్లి అటు నుంచి వాకింగ్ చేసుకుంటా రైతుబజార్కి వెళ్లి కూరగాయలు తెచ్చుకుంటా పడిపోయాడు, ఆసుపత్రికి తీసుకెళితే ఆసుపత్రిలో మరణించాడు అని మంత్రి చెప్పారు.
ఈ తెలుగుదేశం పార్టీ రాబందులు, కొన్ని మీడియా రాబందులు ఉల్లిపాయల కోసమే వెళ్లి చనిపోయాడు అని ప్రచారం చేశారని మంత్రి అన్నారు. మా కుటుంబంలో ఉల్లిపాయల కోసం వెళ్లి లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు, ఒకవేళ నిలబడాల్సి వచ్చినా ఈ గుండెనొప్పి ఉన్నాయన్ని తీసుకెళ్లి లైన్లో నిలబెట్టి ఆయన్ను చంపుకునే వ్యక్తులం కాదు అని ఆ కుటుంబ సభ్యలు చెప్పారని మంత్రి వివరించారు.
కాబట్టి మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు వదిలేయండి అని వారు అంటున్నారని మంత్రి తెలిపారు. ఈనాడు డెస్క్ ఇన్ఛార్జ్, ఆంధ్రజ్యోతి డెస్క్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు వాళ్లకు ఫోన్లు చేసి, ఉల్లిపాయలు కోసం చనిపోయారు అని చెప్పండి, పొద్దున్న ఏడింటికల్లా చంద్రబాబు మీ ఇంటి దగ్గర దిగిపోతారు, మీకు 25లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పిస్తాము అని చెప్పేసి వాళ్లమీద విపరీతమైన ఒత్తిడి తెచ్చారని మంత్రి వెల్లడించారు.
చంద్రబాబునాయుడు ఈ రాష్ట్రమంతా ఆయన జాగీరులా ఏం చేస్తే అది అక్కడ చేద్దామంటే కుదరదు, అది గుడివాడ, గుడివాడలో కొడాలి నాని ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోమని కోరుతున్నా అని మంత్రి అన్నారు.