ప్రపంచవ్యాప్తంగా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా తన సొంత డబ్బుతో దాదాపు 75,000 మాస్కులు పట్టణంలోని ప్రతి ఇంటికి అందిస్తున్నట్లు తెలిపారు.
శ్రీకాళహస్తి పట్టణంలో జిల్లాలోనే మొదటి కరోనా కేసు నమోదు కావడం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కచ్చితంగా ఇంట్లోనే ఉండాలని ఆయన కోరారు. తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే ఇంటి నుండి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని నిత్యావసరాలు అత్యవసరాలు కోసం ఒక గంట మాత్రమే బయట ఉండాలని ఆయన కోరారు.
మందులు, టీకాలు లేని కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా నిలపడమే శరణ్యమని ఆయన తెలిపారు. పట్నంలోని అధికారులందరినీ అప్రమత్తం చేస్తున్నామని శానిటేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలని కోరామని తెలిపారు. కరోనా వైరస్ అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పడుతున్న తపన అందరూ గమనించాలని ఆయన కోరారు.
కరోనా వైరస్ నివారణకు ఉన్న అన్ని మార్గాలను అనుసరించాలని అందుకే పట్టణంలోని ప్రతి ఇంటికి వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల ద్వారా మాస్కులు అందిస్తున్నామని తెలిపారు.
అదే విధంగా స్వచ్ఛంద కర్ఫ్యూ వలన జీవన ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు కూడా వారి కోసం పాటుపడాలని శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కోరారు.