రాఫెల్ కేసుకు సంబంధించి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై క్లీన్చిట్ ఇవ్వడాన్ని సమీక్షించాలంటూ దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాఫెల్ ఒప్పందంపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ అవసరంలేదని స్పష్టం చేసింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు 2018 డిసెంబర్ 14న తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
కాగా రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని ఉద్దేశించి ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ వ్యాఖ్యానించడం.. తన విమర్శను సుప్రీం తీర్పునకు ఆపాదించడంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘చౌకీ దార్ చోర్’ వ్యాఖ్యలను రాహుల్ తమకు ఆపాదించడం దురదృష్టకరమనీ.. ఆయన భవిష్యత్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలంటూ సూచించింది. ఈ కేసులో రాహుల్ గాంధీ పెట్టుకున్న క్షమాపణను అంగీకరించింది. ఆయనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేసింది. కాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందికి వస్తాయంటూ బీజేపీ నేత మీనాక్షి లేఖి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.