దేశంలో ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ. అందులో సందేహం లేదు. ఆయన రాజ్యంగ నిపుణుడు కూడా. ఆయన ఏ కేసు తీసుకున్నా విజయమే తప్ప అపజయం ఉండదు. అలాంటి న్యాయవాదికి అమరావతి నుంచి రాజధాని తరలింపుపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదించి కేసు నెగ్గించే బాధ్యతను ముకుల్ రోహత్గీకి అప్పగించారు. ఇందుకు గాను ఆయనకు ఐదు కోట్ల రూపాయల ఫీజు ఇవ్వబోతున్నారు. అడ్వాన్స్ గా కోటి రూపాయల ప్రభుత్వ ధనాన్ని ఆయన కు ఇచ్చేశారు. దీని కోసం నేడు ప్రత్యేక జీవో విడుదల అయింది. ముకుల్ రోహత్గీకి అంత భారీ మొత్తంలో ఫీజు ఇవ్వడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముకుల్ రోహత్గీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును కూడా వాదించారు.
అక్రమాస్తుల కేసు వాదించిన న్యాయవాదికే అమరావతి కేసును అప్పగించడం అందుకోసం భారీ ఎత్తున ఫీజు చెల్లించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సాధారణంగా ముకుల్ రోహత్గీ సాధ్యమైనంత ఎక్కువ ఫీజే వసూలు చేస్తారు. అలా తాను సంపాదించిన దాంట్లో చాలా వరకూ సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.
ముకుల్ రోహత్గీ సామర్ధ్యం గురించి ఆయన తీసుకునే ఫీజు గురించి ఎవరికి అభ్యంతరం ఉండే అవకాశమే లేదు. అయితే రైతులు దాఖలు చేసిన కేసు వాదించేందుకు తన కేసులు వాదించిన అడ్వకేట్ ను తీసుకొచ్చి పెట్టుకోవడం పైనే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.