ఢిల్లీ మర్కజ్ మసీదులో జరిగిన తబ్లిగీ జమాత్ లో పాల్గొని తిరిగి వచ్చిన నాగర్ కర్నూలు పట్టణానికి చెందిన 32 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ అధికారికంగా వెల్లడించారు. అతడిని హైదరాబాద్ హాస్పిటల్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
నాగర్ కర్నూలు పట్టణంలోని అతడు నివాసం ఉంటున్న వార్డులో శానిటేషన్ పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. చుట్టూ పరిసర ప్రాంతాల్లో 100% లాక్ డౌన్ చేపట్టాలని అతడు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడో వివరాలు సేకరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచనలు జారీ చేశారు