ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ పట్టణంలో 24 వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించనున్నట్లు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ తెలిపారు. 2020 సంవత్సరాన్ని నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించిందని, రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని ఆయన తెలిపారు.
నర్సింగ్, మిడ్వైఫరీ వర్క్ఫోర్స్ పై ఎక్కువ శ్రద్ధ చూపడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్ఓ చెప్పిందని ఆయన అన్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించినందున నైటింగేల్ జయంతిని ఘనంగా జరపాలని నిర్ణయించినట్లు రక్ష్మణ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్, నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్ విద్యార్థులు, ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు అందరూ కలసి కొవ్వొత్తి ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ర్యాలీ నిజామాబాద్ ప్రభుత్వ వైద్య శాల నుండి మొదలై గాంధీ చౌక్ వరకు వెళ్లి తిరిగి మరల ప్రభుత్వ వైద్య శాలకు చేరుకుంటుంది. నర్సు, మిడ్వైఫరీ సంవత్సరాన్ని స్వాగతించడానికి అందరూ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.