నేపాల్ లోని ఒక హోటల్ గదిలో చలి తట్టుకోలేక ఇద్దరు పిల్లలు మరణించారని, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సత్యం న్యూస్ రెండు రోజుల కిందట వెల్లడించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆ ముగ్గురు కూడా మరణించారు. సత్యం న్యూస్ ఈ వార్త వెల్లడించే సమయానికి చనిపోయిన వారి వివరాలు తెలియలేదు. ఇప్పుడు పూర్తి వివరాలు వచ్చాయి.
చనిపోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రవీణ్ కృష్ణన్ నాయర్ (39) గత 15 సంవత్సరాలుగా దుబాయ్ లో నివసిస్తున్నారు. ఆయన భార్య శరణ్య (34) కాగా ఆయనకు ముగ్గురు పిల్లలు శ్రీభద్ర (9) అర్చ (8) అభి(7). కృష్ణన్ నాయర్ ప్రస్తుతం ఒక్కరే దుబాయ్ లో ఉంటున్నారు. భార్యా పిల్లలు తిరువనంతపురంలో ఉంటున్నారు. శరణ్య తన ఎంఫారమ్ చదువు పూర్తి చేసేందుకు తిరువనంతపురంలో ఉన్నారు.
ముగ్గురు పిల్లలూ కూడా జనవరిలోనే పుట్టడంతో వారి జన్మ దినాన్ని జరుపుకోవడానికి కృష్ణన్ నాయర్ దుబాయ్ నుంచి తిరువనంతపురం వచ్చారు. అక్కడ నుంచి మరో 15 మంది బృందంతో కలిసి వారంతా నేపాల్ పర్యటనకు బయలు దేరారు. మొత్తం 8 గదులు బుక్ చేసుకున్నాకూడా అందరూ కలిసి రెండు గదులలోనే సర్దుకున్నారు. వారు బస చేసిన హోటల్ సముద్ర మట్టానికి 2500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అత్యంత శీతలంగా ఉంటుంది. అక్కడ నుంచి హిమాలయ పర్వతాలు కనిపిస్తుంటాయి. చలిని తట్టుకోవడానికి వారు గ్యాస్ హీటర్ ను ఉపయోగించారు. హీటర్ ను పరిమితికి మించి పెట్టుకుని ఊపిరి అందక మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్న పిల్లలు, భార్యా భర్తా ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఊపిరి అందక అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురిని ఖాట్మండు ఆసుపత్రికి విమానంలో పంపినా కూడా లాభం దక్కలేదు. వారు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.