రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేల రూపాయల పింఛన్ తో బతికే ఒక వృద్ధుడిని కూడా రెవెన్యూ సిబ్బంది లంచాల కోసం పీడిస్తున్నారు. విసిగి పోయిన ఆ వృద్ధుడు నేడు సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ తహశీల్దార్ కార్యాలయం లో ఆత్మ హత్యకు ప్రయత్నించాడు. అతని చేతుల్లో ఉన్న పెట్రోలు బాటిల్ ను లాక్కుని పోలీసులు అతడిని కాపాడారు కానీ లేకపోతే ఆ వృద్ధుడి ఉసురు ఈపాటికే పోయి ఉండేది.
కాసుల కిష్టయ్య మిట్టపల్లికి చెందిన రైతు. అతను ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిలో గత 20 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్నాడు. అక్కడే ఉంటున్నాడు. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన అధికారులు భూమి రికార్డులు మార్చారు. పై అధికారులు రమ్మంటున్నారు. వచ్చి మాట్లాడమంటున్నారు అంటూ గడియగడియకూ కింది స్థాయి సిబ్బంది అతన్ని సతాయిస్తున్నారు.
దాంతో విసిగి పోయిన కాసుల కిష్టయ్య నేడు పెట్రోలు సీసా తీసుకుని అర్బన్ MRO కార్యాలయానికి వచ్చాడు. అధికారులు లంచం అడుగుతున్నారని, తానే బతికేందుకు ఇబ్బందిగా ఉంటే వీళ్లకు లంచం ఎలా ఇవ్వాలని అడుగుతూ బాటిల్ లోని పెట్రోలు వంటిపై వంపుకోబోయాడు. దాంతో అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతడిని నిలువరించారు.