ఉగ్రవాద సంస్థలకు సాయం చేయడం ఆపనందున పాకిస్తాన్ ను నిషేధిత జాబితా నుంచి తీసేయడం కుదరదని పారిస్ లో జరిగిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఏటీఎఫ్) ప్లీనరీ సమావేశం నిర్ణయించింది. భారత్ లో వరుస దాడులకు బాధ్యులైన లష్కరే తోయిబా, జైష్-ఇ-మొహమ్మద్ (జేఎం), హిజ్బుల్ ముజాహిదీన్ వంటి టెర్రరిస్టు గ్రూపులకు నిధులు నియంత్రించడంలో పాకిస్థాన్ విఫలమైందని ప్లీనరీ ఒక నిర్ణయానికి వచ్చింది.
పాకిస్తాన్ ను నిషేధిత జాబితా నుంచి తీసేయాలంటే 27 బాధ్యతలను అప్పగించగా అందులో కొన్నింటిని మాత్రమే పాక్ చేయగలిగింది. పాకిస్తాన్ నిషేధిత జాబితాలో ఉండటం వల్ల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఎడిబి, యూరోపియన్ యూనియన్ ల నుంచి ఆర్థిక సాయం పొందడం కష్టం అవుతుంది. ఇప్పటికే దారుణమైన ఆర్థిక పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ మరిన్ని సమస్యలలో కూరుకుపోతుంది.
పాకిస్తాన్ ను నిషేధిత జాబితా నుంచి తీసేయాలని మలేషియా పట్టుబట్టింది. అయితే పాకిస్తాన్ చేస్తున్న దురాగతాలను భారత్ సాక్ష్యాధారాలతో సహా నిరూపించడంతో మిగిలిన దేశాలు పాకిస్తాన్ పై నిషేధాన్ని ఎత్తి వేసేందుకు అంగీకరించలేదు. పాకిస్తాన్ గ్రే లిస్టు నుంచి మినహాయింపు పొందాలంటే మొత్తం 39 దేశాలలో 12 దేశాల ఓట్లు పొందాల్సి ఉంటుంది. బ్లాక్ లిస్టు కు చేరకుండా ఉండాలంటే మరో మూడు దేశాల మద్దతు అవసరం అవుతుంది.