39.2 C
Hyderabad
April 25, 2024 15: 44 PM
Slider ఆంధ్రప్రదేశ్

కొత్త కొలువులు వెతుక్కున్న పాతకాపులు

01VJPG4-CHAMBERS

గత ప్రభుత్వంలో పని చేసిన పిఎ, పిఎస్, ఓఎస్ డిలను మళ్లీ తీసుకోవద్దని సాక్ష్యాత్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారుడు అజయ్ కల్లాం ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో పెద్ద ఎత్తున అవినీతి పరులు మంత్రుల కొలువుల్లో చేరిపోతున్నారు. మంత్రులు, మంత్రి హోదా ఉన్న ఇతర పోస్టుల వారికి పి ఎ, పి ఎస్, ఓ ఎస్ డిలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఈ పోస్టులలో గత ప్రభుత్వంలో పని చేసిన వారి తీసుకోవద్దని ప్రభుత్వం ఏర్పాటు అయిన కొత్తలోనే  ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన వారు మధ్యవర్తులుగా ఉండి మంత్రితో పనులు చేయించి ఉభయ తారకంగా ఉండేలా చేసేవారు. అంటే ఆదాయం అందరికి సమానంగా వచ్చే లా చూసేవారు. సందట్లో సడేమియా లాగా వారు కూడా లక్షలు వెనకేసుకునేవారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉండరాదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను చాలా మంది బేఖాతరు చేస్తున్నారు. దాంతో ఇప్పటికే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మంత్రుల వద్ద పని చేసిన వారిని తీసుకోవద్దని చెప్పినా కూడా చాలా మంది కొత్త మంత్రులు అలాంటి వ్యక్తులవే ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారు. ముఖ్యమంత్రి కార్యాలయం చాలా వరకూ ఇలాంటి ఫైళ్లను ఆపిపెట్టింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి క్లియరెన్సు రాకపోవడంతో కొందరి నియామకాలు ఆగిపోయినా కూడా మరి కొందరివి మంత్రులు దగ్గరుండి క్లియర్ చేయించుకుంటున్నారు. దాంతో మెహమాటానికి పోయి సి ఎం కార్యాలయం కూడా కొన్ని ఫైళ్లను క్లియర్ చేస్తున్నది. ఈ విధంగా క్లియరెన్సు తెచ్చుకోని వాళ్లు అనధికారికంగా మంత్రుల కార్యాలయాలలో పని చేస్తున్నారు. వారికి జీతం, భత్యం రాదు కానీ వారు మంత్రిని అంటిపెట్టుకుని అలానే తిరుగుతున్నారు. వాస్తవానికి వారికి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు. వారి ఆదాయం వారు తెచ్చుకోవడమే కాకుండా మంత్రికి కూడా ఇచ్చేంత సంపాదించే శక్తి వారికి ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పని చేసి రిటైర్ అయిన వాళ్లు తమకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో వర్తించదని చెబుతూ మళ్లీ ఉద్యోగాలలో చేరుతున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టీచర్లు పి ఏ లుగా, పి ఎస్ లుగా ఓ ఎస్ డిలుగా పని చేయకూడదు. అలాంటిది టీచర్ ఒకాయన ఒక ఉప ముఖ్యమంత్రి దగ్గర చేరిపోయాడు. ప్రస్తుతం అనారోగ్యం కారణాలతో అతడు సెలవులో ఉన్నాడు. ఆరోగ్యం కుదుటపడగానే మళ్లీ ఉప ముఖ్యమంత్రి దగ్గర చేరతాడు. అదే విధంగా మంత్రి పుల్లా రావు దగ్గర పని చేసిన ఒక వ్యక్తి పెద్ద స్థాయిలో పైరవీలు చేసుకుని నేడో రేపో ఒక మంత్రి వద్ద చేరిపోతాడని అంటున్నారు. కాల్వ శ్రీనివాసులు దగ్గర పని చేసిన మరొక వ్యక్తి ఒక ప్రధాన శాఖ కు చెందిన మంత్రి వద్ద పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని ఫైల్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నిలుపుదల చేసింది. ప్రభుత్వ విప్ ల దగ్గరా, చీప్ విప్ దగ్గర కూడా ఇలాంటి రిటైర్డ్ వ్యక్తులు అవకాశాల కోసం తిరుగుతున్నారు. అనధికారికంగా పని చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో మరింత క్లారిటీ ఇచ్చి నిలుపుదల చేయకపోతే అనధికారికంగా పని చేస్తున్న వారు ఆ తర్వాతి కాలంలో నైనా రెగ్యులరైజ్ చేయించుకుంటారు. ఇది ఆపకపోతే అవినీతి యధా ప్రకారం కొనసాగుతూనే ఉంటుంది.

Related posts

తమ్ముడ్ని తిడుతున్నా ఉలకని పలకని చిరంజీవి

Satyam NEWS

రాజారెడ్డి రాజ్యాంగం నశించాలని రాజ్యాంగ నిర్మాతకు వినతిపత్రం

Bhavani

11న తిరుమలలో శ్రీ పురందరదాస‌ ఆరాధనా మహోత్సవం

Satyam NEWS

Leave a Comment