పల్లెప్రగతి కార్యక్రమం తో గ్రామాల రూపు రేఖలు మారుతున్నాయని, అందుకే సీఎం కేసీఆర్ పట్టణాలలో మార్పు కలిగించేందుకే పట్టణ ప్రగతి ప్రారంభించాలని నిర్ణయించారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. పఠాన్ చెరులోని జీఎంఆర్ ఫంక్షన్ హాలులో పట్టణ ప్రగతి సన్నాహక కార్యక్రమం లో నేడు ఆయన పాల్గొని ప్రసంగించారు.
పట్టణాలు మురికి కూపాలుగా మారకూడదు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన పాలక వర్గం దీనిపై దృష్టి సారించాలి. కౌన్సిలర్లు ప్రజలతో మమేకం కావాలి. వార్డులోని ప్రతీ ఒక్కరూ ఆత్మ బంధువులని గుర్తించాలి అని మంత్రి హరీశ్ రావు కోరారు. కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకోవాలని, అలా చేస్తేనే కౌన్సిలర్లు గా విజయవంతమవుతారని ఆయన అన్నారు.
ఈ నెల24 వ తేదీ నుంచి మార్చి4 వ తేదీ వరకు పట్టణ ప్రగతి జరుగుతుందని ఆయన అన్నారు. పల్లెల్లో ఉన్న ఐక్యత పట్టణంలో వెంటనే రాదు. కొంత కష్ట పడాలి. అసాధ్యం మాత్రం కాదు అని ఆయన అన్నారు. పట్టణ ప్రగతిలో మున్సిపల్, వార్డు ప్రత్యేక అధికారులు సమావేశం పెట్టుకుని కార్యాచరణ తయారు చేయాలని ఆయన అన్నారు.