సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లోని రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో, హైదరాబాద్ ఈ రోజు కవాడిగుడలోని సిజిఓ టవర్స్ లో పాఠశాల విద్యార్థులకై క్విజ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జి. సునీల్ కుమార్ బాబు మాట్లాడుతూ, మన పూర్వీకులు దేశ ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమతి రాజ్యాంగం అని అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని ఆయన గుర్తు చేశారు.
దేశంలోని అనేక భాషలు, ప్రాంతాలను ఏకం చేస్తూ అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని డా.బి.ఆర్ అంబేద్కర్ మనకు అందించారని, అందరికీ సమానమైన హక్కులు కల్పించారని పత్రికా సమాచార కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఎస్. వెంకటేశ్వర్ అన్నారు.
పత్రికా సమాచార కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ పి.రత్నాకర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఉండాలని ఆయన కోరారు. ‘భారత రాజ్యాంగం’ అనే అంశంపై నిర్వహించిన క్విజ్ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు స్వచ్చ్ భారత్పై విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనలను వారి చిత్రాల ద్వారా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో కవాడిగుడ, బన్సిలాల్పేట సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 100 మంది ఉన్నత పాఠశాల కు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కి సంబంధించిన అరుదైన ఛాయాచిత్రాలు ఈ ప్రదర్శనలో ఉంచారు.
ఈ కార్యక్రమంలో హరిబాబు, అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ఓబి, ఆర్ఓబి కి చెందిన ఇతర అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ‘మహాపరి నిర్వాణ’ గుర్తుగా ఈ నెల 6 నుంచి 13 వరకూ వారం రోజుల పాటు రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.