మహిళ పోలీసు దుస్తులు మార్చుకుంటుంటే కొందరు మీడియా వ్యక్తులు ఫొటోలు, వీడియోలు తీశారని తెనాలి డిఎస్పీ శ్రీ లక్ష్మి అన్నారు. మందడం జడ్పి హై స్కూల్ వద్ద అసెంబ్లీ డ్యూటీకి వచ్చిన మహిళా కానిస్టేబుళ్లకు వసతి కల్పించామని వారిపట్ల మీడియా అభ్యంతరకరంగా ప్రవర్తించిందని ఆమె అన్నారు.
ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు ప్రకారం ముగ్గురు కెమెరామెన్ లపై నిర్భయ కేసు నమోదు చేసామని ఆమె తెలిపారు. మహిళ పట్ల మీడియా ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఊహించలేదని సిఐడి అడిషనల్ ఎస్పీ సరిత అన్నారు. మహిళలకి చైతన్యం కలిగించాల్సిన మీడియా ఇలా చేస్తే ఎలా అని ఆమె ప్రశ్నించారు. మహిళా పోలీసులు పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.
మహిళా పోలీసుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే ఉరుకునేది లేదని విశాఖ మహిళా డిఎస్పీ ప్రేమ్ కాజల్ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల నిమిత్తం మందడంకు వచ్చిన కానిస్టేబుల్ డ్యూటీ అనంతరం హైస్కూల్లో వారికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. దుస్తులు మార్చకుంటుండగా కొన్ని చానళ్ల సిబ్బంది గది కిటికీల నుంచి రహస్యంగా వీడియో రికార్డు చేశారని ఆ కానిస్టేబుల్ ఆరోపించారు.
పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆ పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత పాఠశాల హెడ్ మాస్టార్ కోటేశ్వరరావు స్పందించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదులను మహిళా కానిస్టేబుల్స్కు కేటాయించామని, వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.