శ్రీకాళహస్తి దేవస్థానం సమీపంలో ఉన్న ఆలయంలో జరిగిన తాంత్రిక పూజలు రాజకీయ పరమైనవా? ఏమో కానీ స్థానికంగా వినిపిస్తున్న పుకార్లు మాత్రం తీవ్ర కలకలం రేపుతున్నాయి. క్షుద్రపూజలు చేశారనే కారణంతో అరెస్టయిన వారిలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు ఉండటం ఈ అనుమానాలను బలపరుస్తోంది.
తాంత్రిక పూజలను నిర్వహించేందుకు సహకరించిన ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కూడా స్థానిక వైసిపి ప్రజాప్రతినిధికి అత్యంత ఆప్తుడని స్థానికులు చెబుతున్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధంగా ఉన్న నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో అమావాస్య అర్దరాత్రి బిగ్గరగా మంత్రాలు వినిపించడంతో ఒక్క సారిగా ఆలయం చుట్టుపక్కల నివసించే వారు భయపడ్డారు. తీవ్ర ఆందోళనకు గురైన స్థానికులు వెళ్లి చూస్తే లోపల తాంత్రిక పూజలు చేయడాన్ని గమనించారు.
వెనువెంటనే పోలీసులూ రంగంలోకి దిగారు. అయితే స్థానిక ప్రజాప్రతినిధికి సమాచారం అందడంతో కేసును పూర్తిగా గతంలో తాంత్రిక పూజలు నిర్వహించిన కేసులో సస్పెండయిన ధనపాల్పైకి నెట్టేయాలని, అసలు నిజం బయటకు రాకూడదని ఆదేశించారట! దీంతో పోలీసులు కేసు విషయంలో ఏమీ పెద్దగా మాట్లాడటం లేదు.
ఒకసారి తాంత్రిక పూజలు చేస్తూ సస్పెండ్ అయి కూడా మళ్లీ ఇలా తాంత్రిక పూజలకు ధనపాల్ తెగబడటం చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేత అండదండలు, ఆదేశాలతో దనపాల్ తమిళనాడు నుంచి క్షుద్రపూజలు చేసే స్పెషలిస్టులను రప్పించి పూజలు చేశారని అందుకే తొణకడంలేదు, బెణకడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పెద్ద పదవుల్లో ఉన్న వారు కష్టాల పాలు కాకుండా ఉండేందుకు క్షుద్ర పూజలు నిర్వహించినట్లు చెబుతున్నారు. కేసును నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తే తప్ప నిజం బయటపడదు కానీ అలా జరిగే అవకాశం లేదు. ఈ క్షుద్ర పూజలు చేయించిన లేక వెనుక నున్న వారికి పెద్దపదవులు దక్కితే ఈ మొత్తం తతంగం నడిపింది ప్రభుత్వ పెద్దలే అని అర్ధం చేసుకోవాలి.