పరిస్థితి చూస్తుంటే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై కూడా కేసీఆర్ దే పైచేయి కాబోతున్నట్లు అనిపిస్తున్నది. ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 67 ప్రకారం రోడ్డు రవాణా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఆర్టీసీ, ప్రైవేటు వ్యవస్థలు సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పుడు.. కేబినెట్ నిర్ణయం తప్పెలా అవుతుందో చెప్పాలని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. అయితే సెక్షన్ 102 ప్రకారం ఎలాంటి మార్పులు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు వివరించారు. ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని గతంలో సీఎం అన్న వ్యాఖ్యలను కోర్టుకు ఉదహరించారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. సీఎం ఏమి అన్నారన్నది న్యాయస్థానానికి సంబంధం లేదని స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయం చట్ట బద్ధమా? చట్ట విరుద్ధమా? అనేది కోర్టు ముందున్న అంశం అని ధర్మాసనం పేర్కొంది. చట్టం ప్రకారం ప్రతిపాదిత మార్పులను గెజిట్లో ప్రచురించాలని, ప్రతిపాదిత మార్పులు స్థానిక దిన పత్రికల్లో ప్రచురించాలని, అభ్యంతరాలు స్వీకరించేందుకు 30 రోజుల సమయం ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. అయితే చట్ట పరమైన ప్రక్రియ అనుసరిస్తారా? లేదా? తెలియకుండా ఇప్పుడే రూట్ల ప్రైవేటీకరణ చట్ట విరుద్ధమని ఎలా అంటామని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతోందా? అని హైకోర్టు ప్రశ్నించింది. వాదనల అనంతరం కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
previous post