దేశంలో ఖాళీ కాబోతున్న 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఖాళీల కోసం మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మార్చి 13 వరకూ నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.
మార్చి 16న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. మార్చి 18 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంటుంది. అవసరం అయితే మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఏపీ నుంచి ఎమ్ఏ. ఖాన్, టి. సుబ్బిరామిరెడ్డి, కె. కేశవరావు, తోట సీతారామలక్ష్మి రిటైర్ కాబోతున్నారు. అదే విధంగా తెలంగాణ నుంచి కేవీపీ రామచందర్ రావు, గరికపాటి మోహన్ రావు రిటైర్ కాబోతున్నారు.