తెలంగాణేతర ఫోరెన్సిక్ నిపుణులతో దిశ కేసులో ఎన్ కౌంటర్ అయిన నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రక్రియ సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు పూర్తి కావాలని గడువు విధించింది.
రీ పోస్ట్ మార్టమ్ ప్రక్రియను వీడియో తీసి తమకు అందజేయాలని కోరింది. రీపోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశించింది. అంతేకాకుండా, ఎన్ కౌంటర్ లో పోలీసులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకోవాలని సిట్ కు స్పష్టం చేసింది. దిశ నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించడంపై హైకోర్టులో విచారణ జరిగింది.
విచారణకు గాంధీ ఆస్పత్రి చీఫ్ సూపరింటెండెంట్ శ్రవణ్ హాజరయ్యారు. మృతదేహాలను ఎలా భద్రపరిచారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయంపై హైకోర్టు గాంధీ చీఫ్ సూపరింటెండెంట్ను ప్రశ్నించింది. -2 నుంచి 4-డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు మృతదేహాలను భద్రపర్చామని మృతదేహాలు 50 శాతం డీ కంపోజ్ అయ్యాయని శ్రవణ్ కోర్టుకు వివరించారు.
దేశంలోని ఇతర ఆసుపత్రుల్లో మృతదేహాలను భద్రపర్చే సౌకర్యాలు ఉన్నాయా అని కోర్టు గాంధీ ఆసుపత్రి చీఫ్ సూపరింటెండెంట్ను ప్రశ్నించింది. తనకు ఆ విషయం తెలియదని ఆయన కోర్టుకు తెలిపారు. మరో వారం రోజులు ఉంటే..వంద శాతం నాలుగు మృతదేహాలు కుళ్లిపోయే పరిస్థితి నెలకొందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.