ఆర్టీసీని గట్టెక్కిద్దామని ఏ ఒక్కరికీ లేదు. వారు వీరు అని కాకుండా అందరూ కలిసి ఆర్టీసీ పీక నులిమేస్తున్నారు. ఆఖరి శ్వాస తీసుకునేందుకు కూడా ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. ఆదాయానికి మించిన అప్పులు ఒకవైపు, చెల్లించాల్సిన బకాయిలు మరోవైపు ఆర్టీసీ పరిస్థితిని మరింత అయోమయంలో పడేశాయి. తాజా గణాంకాలను పరిశీలిస్తే, 2019 నవంబర్ 8 నాటికి సంస్థ చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ. 2209.66 కోట్లు. అందులో పీఎఫ్ బకాయిలు రూ. 788.30 కోట్లు ఉంది. అదే విధంగా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ బకాయిలు రూ.500.95 కోట్ల వరకూ ఉన్నాయి. 2014 నుంచి 2018 వరకు లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలు రూ. 180 కోట్లు వరకూ చెల్లించాల్సి ఉంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సెటిల్ మెంట్ కింద మరో రూ. 52 కోట్లు చెల్లించాలి. మోటారు వెహికిల్ యాక్టు కింద రూ. 452.36 కోట్లు, హెచ్ఎస్డీ ఆయిల్ బిల్స్ రూ. 34.45 కోట్లు బకాయిలున్నాయి. హెడ్ ఆఫీస్, రీజియన్, జోన్ ఇతర బకాయిలు రూ. 36.40 కోట్లుగా ఉంది. ప్రైవేట్ బస్సు సంస్థల బకాయిలు రూ. 25 కోట్లు కాగా ఆర్టీసీ బస్సుల మరమ్మతు బకాయిలు రూ. 60 లక్షలు చెల్లించాలి. ఆర్టీసీ బస్సు బిల్డర్లకు ఇవ్వాల్సిన మొత్తం రూ. 74.60 కోట్లు ఉంది. ఘనమైన ప్రస్థానం ఉన్న ఆర్టీసీ ఇలా నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. పీకల్లోతు అప్పులతో ఎడతెగని సంక్షోభంలో మునిగిపోతుంది. తాజా గణాంకాల ప్రకారం ఆర్టీసీ చెల్లించాల్సిన రుణాలు మొత్తం రూ. 2 వేల కోట్లకు పైమాటే. అందువల్ల 47 కోట్లో 50 కోట్లో ఇస్తే ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి లేదు.