శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుకూలంగా వచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి పంపింది. గతంలో ఇచ్చిన తీర్పును పక్కన పెట్టడం లాంటి చర్యలు తీసుకోకపోవడంతో శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి న్యాయపరంగా ఇప్పటికి ఎలాంటి అడ్డంకి లేనట్లే కనిపిస్తున్నది. శబరిమల అయ్యప్ప ఆలయంతో బాటు మసీదుల్లోకి మహిళల ప్రవేశం, దావూదీబొహ్రా కమ్యూనిటీలో మహిళల జననాంగాలకు శస్త్రచికిత్స చేయడం లాంటి అన్ని అంశాలపై కూలంకషంగా పరిశీలన జరపాల్సి ఉంటుందని అందుకోసం ఈ అంశాలన్నింటిని విస్తృత ధర్మాసనానికి పంపాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసు ముస్లిం మహిళలు మసీదుల్లోకి ప్రవేశం అనే ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది. సమీక్ష పిటిషన్ తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయని, మతంలో అంతర్గత భాగంగా ఉన్న విషయాలపై చర్చ జరపాలని పిటిషనర్లు కోరారని తెలిపింది. ఒకే మతంలో ఉన్న వివిధ వర్గాల వారికి నచ్చిన విధానాలు ఆచరించే స్వేచ్ఛ ఉందని చెప్పింది. మతంలోకి చొచ్చుకునే అధికారం కోర్టులకు ఉందా? అనే అంశం ఇప్పుడు చర్చకు వచ్చిందని పేర్కొంది. మసీదుల్లో మహిళలకు ప్రవేశం అన్న విషయం కూడా చర్చకు వచ్చిందని తెలిపింది. మతపరమైన విశ్వాసాలను తక్కువ చేయడం తగదని అభిప్రాయపడింది. న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నారిమన్ మిగిలిన ముగ్గురు సభ్యులు ఇచ్చిన ఈ తీర్పును వ్యతిరేకించారు. మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని వారు అభిప్రాయపడ్డారు. మిగిలిన ముగ్గురు ఇచ్చిన తీర్పుతో వారు విభేదించారు.
previous post