మండల-మకరివిళక్కు పూజల కోసం శనివారం సాయంత్రం 5 గంటలకు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. 41 రోజుల వార్షిక శబరిమల యాత్ర తొలి రోజున వందలాది మంది భక్తులు శబరిమల చేరుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలలో వేలాది మంది పోలీసులతో రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలోని పంబ బేస్ క్యాంపు వద్ద మహిళా భక్తుల వయసును నిర్ధారించుకోవడానికి పోలీసులు వారి నుంచి ధ్రువీకరణ పత్రాలు సేకరించి నిర్ధారించుకుంటున్నారు. అన్ని వయసులకు చెందిన మహిళలకు అయ్యప్ప దర్శనానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది తీర్పు ఇచ్చినప్పటికీ భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటనలు రావడంతో రుతుస్రావ వయసులోని మహిళలు కొందరు గత ఏడాది ఆలయ ప్రవేశం చేయలేకపోయారు. అయితే ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం కనపడుతోంది. మహిళా భక్తులను రక్షణ కల్పించబోమని కేరళ ఆలయాల వ్యవహారాల మంత్రి సురేంద్రన్ ప్రకటించిన నేపథ్యంలో శనివారం పంబకు చేరుకున్న ఐదుగురు మహిళలను పోలీసులు వెనక్కు తిప్పిపంపించివేశారు. 10-50 మధ్య వయసు ఉన్న మహిళలను ఆలయానికి అనుమతించవద్దని తమకు కచ్ఛితమైన ఆదేశాలు ఉన్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా రెండు మూడు రోజుల్లో శబరిమల దర్శనానికి వస్తున్నట్లు భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్ ప్రకటించారు. అదే విధంగా చెన్నైకు చెందిన మనితి సంఘం సభ్యులు కూడా ఆలయాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. వీరు కాక మరో 45 మంది మహిళా భక్తులు కూడా దర్శనం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు.
previous post