సోషల్ డిస్టెన్సింగ్ ఒక్కటే ఈ సమయంలో కరోనా విస్తృతికి అడ్డుకట్ట వేసే ప్రధాన ఆయుధమని అందువల్ల అందరూ దాన్ని పాటించాలని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. నేడు ఆయన శ్రీకాళహస్తి పట్టణంలోని మార్కెట్ యార్డ్ ను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ కరోనా వైరస్ కు భాష, కుల, మతాల తేడాలేదని అజాగ్రత్తగా ఉంటే అందరికి సోకుతుందని ఆయన అన్నారు. అందుకే మనం కూడా కుల మతాలకు అతీతంగా కరోనా వైరస్ పై కలిసి పోరాటం చేయాల్సి ఉందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కూరగాయలు అమ్మాలని విక్రయదారులకు సూచించారు. అలాగే ప్రతి ఒక్కరూ వరసలో వచ్చి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ కూరగాయలు తీసుకొని వెళ్లిపోవాలని, ఎక్కడ జనాలు గుంపుగా చేరకుండా ఉండాలని అని సూచించారు.
కరోనా బాధితులకు, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఆర్థిక సాయం అందించిన దాతలు అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కులమతాలు ప్రాంతాలు రాజకీయాలకతీతంగా కరోనా నివారణకు ఆర్థిక సహాయం చేసిన వైఎస్ భారతీ రెడ్డి, అజీమ్ ప్రేమ్ జీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నారా భువనేశ్వరిలకు ధన్యవాదాలు తెలిపారు.
అదే విధంగా సినీ తారలు ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, బాలకృష్ణ, క్రీడా దిగ్గజం పీవీ సింధు అందరికీ స్థానిక శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే వారి ఫోటోలను ఫ్లెక్సీపై ముద్రించి పట్టణంలోని కూడళ్ళలో ఏర్పాటు చేశారు.