పల్లెలను ఆదర్శవంతంగా అభివృద్ది చేసుకోవడంలో ప్రతి పౌరుడు బాధ్యత గా ముందుకు రావాలని రాష్ట్ర ఫ్లయింగ్ స్క్వాడ్ కే. అనిల్ కుమార్ సూచించారు. గురువారం అమ్రాబాద్ మండలం మన్ననూర్, మాచారం గ్రామాలలో నిర్వహించిన రెండవ పల్లె ప్రగతి పనులను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామాలలోని వీధులలో కాలినడకన పర్యటించి పచ్చదనం, పరిశుభ్రత పనులను పరిశీలించారు. వైకుంఠ ధామం, కంపోష్టు యార్డు, నర్సరీల నిర్మాణ స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో యువత, ప్రజలు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ముందుండాలని సూచించారు. పల్లెలు అభివృద్ది చెందినప్పుడే తెలంగాణ రాష్ర్టం అభివృద్ది సాధ్యమవుతుందని తద్వారా దేశం అభివృద్ది చెందుతుందని ఆయన తెలిపారు. గ్రామాలలోని వార్డుల వారిగా అభివృద్ది పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించి చక్కని ప్రతిభ కనబరిచిన వార్డుల వారికి ప్రోత్సాహక బహుమతులను అందించడం ద్వారా అందరూ పోటీ పడి పనిచేస్తారని ఆయన అన్నారు.
తప్పని సరిగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకొని వినియోగించేలా చూడాలని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించడం ద్వారా కొంత మార్పు సాధ్యమవుతుందని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి తమ గ్రామ అభివృద్దిలో పాలు పంచుకునేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రయత్నించాలని సూచించారు.
ఈ సందర్భంగా మాచారం గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాఠశాలను దాదాపు 20 లక్షల మేర ఖర్చుచేసి సుందరంగా తీర్చిదిద్దిన మాచారం గ్రామానికి చెందిన జలంధర్ రెడ్డి ఆయన అభినందించారు. గ్రామ పంచాయితీ పుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శంకర్ నాయక్, ఎంపిఓ వెంకటయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.