గ్రామాల్లో ప్రజలకు కరోనా వైరస్ పై పూర్తి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్లు తీసుకోవాలని కోటగిరి ఎస్సై మఛ్చెంధర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కోటగిరి పోలీస్టేషన్ పరిధిలోని గ్రామాల సర్పంచ్లు,ఎన్సీసీ క్యాడేట్లు,ప్రెస్ రిపోర్టర్లకు ఎస్సై తన స్వంత ఖర్చులతో మాస్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ బారినుండి గ్రామాలను కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్లదేనన్నారు. కరోనా వైరస్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే బాధ్యత సర్పంచ్లు తీసుకోవాలని కోరారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా బారినుండి అమాయక ప్రజలను కాపాడాలని గ్రామాల్లో ఎక్కువ మంది ఒకచోట గుమిగూడకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తి గత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. గ్రామంలోని ఒక్కో ఇంటికి రెండు మాస్కుల చొప్పున సర్పంచ్లు కుట్టించి అందించాలని కోరారు. కరోనాను తరిమి కొట్టే బాధ్యత అందరిదని ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు సహకరిస్తే కరోనాను అరికట్టడం అంత కష్టమేమీ కాదని ఎస్సై అన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి పీఏసీఎస్ చైర్మన్ కూచి సిద్దు, ఆయా గ్రామాల సర్పంచ్లు,నాయకులు అర్షద్, బేగరి రాములు తదితరులు పాల్గొన్నారు.