తిరుమలకు విచ్చేసే భక్తులు, స్థానికుల సౌకర్యార్థం టాటా ట్రస్టు సహకారంతో అశ్విని ఆసుపత్రిని అభివృద్ధి చేశామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వై వి సుబ్బారెడ్డి తెలిపారు. ఆధునీకరించిన అశ్విని ఆసుపత్రిని శుక్రవారం ఉదయం పూజలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ టాటా ట్రస్టు రూ. 4 కోట్లతో ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చగా, టిటిడి రూ.65 లక్షలతో ఆసుపత్రి పరిసరాలను అభివృద్ధి చేసిందన్నారు. 30 పడకలు గల ఈ ఆసుపత్రిలో 2 ఐసియులు, మినీ ఆపరేషన్ థియేటర్, నూతన పరిశోధనశాల ఉన్నాయని తెలిపారు. అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన చికిత్స కూడా అందుబాటులో ఉందన్నారు.
క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ చికిత్స కోసం టాటా ట్రస్టు సహకారం అందించనుందని వివరించారు. గతంలో ఇక్కడి రోగులను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్కు రెఫర్ చేసేవారని, ఇకపై అలాంటి అవసరం లేకుండా అశ్విని ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. టిటిడికి సహకారం అందిస్తున్న టాటా ట్రస్టుకు, అపోలో ఆసుపత్రి సంస్థలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి, చీఫ్ ఇంజినీర్ జి.రామచంద్రారెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. నాగేశ్వరరావు, అశ్విని ఆసుపత్రి వైద్యులు డా. కుసుమకుమారి, డా. నర్మద, డా.పి.కుసుమకుమారి, టాటా ట్రస్టుకు చెందిన రేడియేషన్ అంకాలజిస్ట్ డా. గౌతమ్, ప్రతినిధులు డి.రమణ, కాశీ శ్రీనివాస్, అపోలో ఆసుపత్రికి చెందిన డా.వాణి తదితరులు పాల్గొన్నారు.