అమెరికా భారత్ మధ్య 300 కోట్ల డాలర్ల మేరకు రక్షణ ఒప్పందాలు జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. సోమవారం అహ్మదాబాద్ లో జరిగిన ‘ నమస్తే ట్రంప్ ‘ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు.
అమెరికన్ల హృదయాల్లో భారతదేశం ఇప్పుడు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. “అమెరికా భారతదేశాన్ని ప్రేమిస్తుంది, అమెరికా భారత్ ను గౌరవిస్తుంది. అమెరికా ఎప్పుడూ నమ్మకమైన మిత్రులకు అండగా ఉంటుంది’’ అని ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీని బాగా బేరం చేస్తారని ఆయన అన్నారు.
నరేంద్ర మోడీని ఆయన ప్రశంసిస్తూ మీరు కేవలం గుజరాత్ కు మాత్రమే గర్వకారణం కాదు. కష్టపడి పనిచేయడం ద్వారా భారతీయులు తాము కోరుకునేది ఏదైనా సాధిస్తారు అనేదానికి మీరు ఒక సజీవ ఉదాహరణ అని అన్నారు. మోడీ టీ అమ్మిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
భారతదేశం చేపట్టిన అంతరిక్ష మిషన్ చంద్రయాన్ II పై ట్రంప్ మాట్లాడుతూ, “మీకు సహకరించడానికి అమెరికా ఎదురు చూస్తోంది. స్టార్స్ కు మన ప్రయాణంలో భాగస్వాములమవుదాము” అన్నారు. భారతదేశ వైవిధ్యాన్ని ప్రశంసిస్తూ భారతదేశం లో లక్షలాది మంది హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, క్రైస్తవులు కలిసి మెలిసి జీవిస్తారు ఇదే భారత్ గొప్పదేశం కావడానికి కారణం అని అన్నారు.